ఈ నెల 19 వ తేదీ బుధవారం నుండి 23 వ తేదీ ఆదివారం వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాల గురించి దేవాదాయ శాఖా కమిషనర్ ఎన్.శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఎం .హన్మంతరావు ,ACP రమేష్ ,దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కరరావు,అదనపు కలెక్టర్ వీరారెడ్డి భువనగిరి ,చౌటుప్పల్ ఆర్ డి ఓ లు కృష్ణారెడ్డి , శేఖర్ రెడ్డి ,జిల్లా అధికారులు ,ప్రధాన అర్చకులు ,ఆలయ అధికారుల తోయాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమీషనర్ మాట్లాడుతూ.. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులకు కేటాయించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.వి ఐ పి లను దృష్టిలో పెట్టుకొని తగిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనీ చెప్పారు. .ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుండి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని,భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆదేశించారు.
భద్రత ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని, ఆలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి సదుపాయాలు,మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. సూదుర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ వారు అదనపు బస్సులు నడపడంతో పాటు,రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు . ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు జరిగే మహోత్సవాన్ని భక్తుల భాగస్వామ్యంతో గొప్పగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు.